-స్వామి

ఫిబ్రవరి 21 నుంచి బ్రహ్మోత్సవాలు

‘ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు…’ అని పదకవితా పితామహుడు అన్నమాచార్యులు తిరుమలేశుని కీర్తించినట్లు నారసింహుడూ భక్తులు కోరినట్లు అనుగ్రహిస్తాడు. ‘భగవంతుడి కోసం భక్తులు కారు…భక్తుల కోస•ం భగవంతుడు’ అని పురాణగాథలను బట్టి, ఆధ్యాత్మికోన్నతి సాధకులను బట్టి అవగతమవుతుంది. పరమ భాగవతోత్తముడు బాలప్రహ్లాదుని బ్రోచేందుకు ఉగ్ర నరసింహుడిగా అవతరించిన నారసింహుడు, యాదరుషి విన్నపం మేరకు లక్ష్మీసమేతంగా ప్రసన్నవదనుడిగా కొలువు దీరాడు. అదే నాటి (పంచనారసింహ క్షేత్రం) యాదగిరిగుట్ట నేటి యాదాద్రి. ఏటా ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి ద్వాదశి వారకు పదకొండు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. గుహాలయంగా సుపరిచితమైన ఆలయం అత్యంత ఆధునిక హంగులు సమకూర్చుకుంది. ఆలయపునర్నిర్మాణం నేపథ్యంలో నరసింహుడు బాలాలయం పేరుతో భక్తులకు దర్శనమిచ్చారు. దివ్యభవ్య మందిరంలోని ఆయన దర్శనం అందుబాటులోకి వచ్చిన తరువాత జరుగనున్న కల్యాణోత్సవాల కోసం భక్తికోటి నిరీక్షిస్తోంది.

‘ఇందుగలడందులేడని సందేహం వలదు…’ అని పోతనామాత్యుడు ప్రహ్లాదుడితో పలికించినట్లు భగవంతుడు సర్వాంతర్యామి. జగత్తంతా నిబిడీ కృతమైనట్లు చెప్పడమే భగవతత్త్వం. నరసింహావ తారం పరమార్థమూ అదే.

‘నాహం వసామి వైకుంఠే నయోగి హృదయేరవౌ!

మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారదా!!’ (నేను వైకుంఠంలో లేను. యోగులు హృదయాల లోనో, సూర్యునిలోనో కనిపించను. నా భక్తులు తలచే చోట, నన్ను కీర్తించేచోట ఉంటాను’ అని శ్రీ మహా విష్ణువు దేవర్షి నారదమునితో అన్నట్లు పద్మ పురాణం పేర్కొంటోంది. అలాంటి విశిష్ట నృసింహ క్షేత్రాలలో యాదాద్రి (యాదగిరిగుట్ట), పంచనార సింహ క్షేత్రం ఒకటి. నృసింహుని చరిత్ర ఎన్నో పురాణాలలోనూ వర్ణితమైంది. ఈ క్షేత్రం గురించి స్కాంద, బ్రహ్మాండ పురాణాలలో ఉంది. హిరణ్య కశిపుని వధానంతరం శ్రీమహావిష్ణువు తన ఉగ్రరూపాన్ని (సింహ) ఉపసంహరించి ప్రహ్లాదునికి ప్రేమాస్పదమూర్తిగా, ప్రసన్నకారుడిగా దర్శనాన్ని అనుగ్రహించాడంటారు. అలా తేజరిల్లిన దివ్య క్షేత్రమే యాదాద్రి. శ్రీ మహా విష్ణువు నరసింహుని రూపంలో అర్చామూర్తిగా ఆవిర్భవించారు.

మహాజ్ఞాని విభాండకుడి మనవడు, రుష్య శృంగుడి కుమారుడు యాదరుషి కోరిక మేరకు ఉగ్ర, జ్వాల, గండభేరుండ, యోగానంద, ఉగ్ర నరసింహ, శ్రీ లక్ష్మీనృసింహస్వామి రూపాలతో శ్రీమన్నా రాయణుడు ఈ క్షేత్రంలో సాక్షాత్కరించారు. కొండగుహ లోని రెండు శిలలపై యోగానంద నరసింహుడు, శ్రీలక్ష్మీనరసింహుడు విగ్రహరూపంలో కనిపిస్తారు. ఆ రెండు శిలా ఫలకాల మధ్య సన్నటి రే•లా సర్పాకృతిలో జ్వాలా నరసింహస్వామి దర్శన మిస్తాడు. ఆంజనేయుడు క్షేత్రపాలకుడిగా తూర్పు వైపు, కొండబిలంలో గండభేరుండస్వామి కొలువై ఉంటారు. ఉగ్రనరసింహుడు అభౌతిక రూపంలో కొండ చుట్టూ తేజోవలయంలా ఆవరించి ఉంటాడని భక్తుల విశ్వావం. అందుకే కొండను ఉగ్రనరసింహ స్వామి రూపంగా కొలుస్తారు.

యాదరుషి తపస్సు కారణంగా సింహాకృతిలోని ఆ గుట్ట ‘యాదవగిరి’గా కాలక్రమంలో యాదగిరి గుట్ట, యాదాద్రిగా వ్యవహారంలోకి వచ్చింది పురాణాల విశేషాలను బట్టి యాదరుషి ప్రహ్లాదుడి మాదిరిగానే పరమ విష్ణుభక్తుడు. నృసింహ సాక్షాత్కారం కోసం అడవిదారి పట్టి తపస్సు ద్వారా తన ఆశయ సాధన కోసం ప్రశాంతమైన ఈ పర్వత ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఆయనను అక్కడి కొండజాతి వారు పట్టి క్షుద్రదేవతలకు బలి ఇచ్చేం దుకు ప్రయత్నిస్తుండగా, స్వామి తరపున సుదర్శన చక్రం వచ్చి కాపాడిందని, ఈ క్షేత్రం చుట్టూ సుదర్శ నుడు రక్షణ వలయాన్ని నిర్మించాడని స్థల పురాణం. క్షేత్రానికి సంబంధించి మరో కథనం ప్రకారం, ఈ గుట్టకు రెండు మైళ్ల దూరంలో స్వామి వారు వెలిశారు. దానినే పాత నృసింహాలయంగా వ్యవహరిస్తారు.

పన్నెండవ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య త్రిభువన మల్లుడు స్వామివారిని సేవించుకున్నారని భువనగిరి కోటలోని శాసనం ద్వారా తెలుస్తోంది. అనంతర కాలంలో కాకతీయ గణపతి దేవుడు, శ్రీకృష్ణ దేవరాయలు దర్శనం చేసుకున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. చాలాకాలం పాటు మరుగున పడిపోయిన క్షేత్ర మహాత్మ్యాన్ని స్థానిక గ్రామాధికారి గుర్తించారు. ఆయనకు స్వామి కలలో కనిపించి అవతార రహస్యాన్ని చెప్పారని, భాగ్యనగర వాస్తవ్యుడు రాజా మోతీలాల్‌ ఆలయాన్ని నిర్మించి, పూజాదికాలను పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. ఎంతో మహిమాన్వితమైన క్షేత్రంగా మన్ననలు అందుకుంటున్న దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దింది. పురాతన గుహాలయంగా భక్తులకు సురపరిచితమైన ఈ ఆలయం ఆధునిక హంగులు సమకూర్చుకుని అద్భుత క్షేత్రంగా అలరిస్తోంది. ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిలో భాగంగా ‘యాదమహర్షి తపో వృక్షస్థలి’ రూపుదిద్దుకుంది. గిరి ప్రదక్షిణకు అవకాశం గల అరుదైనది యాదాద్రి. ఈ కొండనే ‘నరసన్న’ పంచమ  క్షేత్రాలలో రూపంగా భావించి ‘యాదగిరి నరసింహా! ఆదుకో…నీ కొండక చేదుకో’ అంటూ గిరి ప్రదక్షిణ చేస్తారు.

అనారోగ్యం, గ్రహపీడ బాధితులు, సంసార బాధ దుఃఖితులు మండలదీక్ష ప్రదక్షిణలు చేపడుతుంటారు. సాక్షాత్తూ బ్రహ్మ కడిగిన పాదాల నుంచి ఉద్భవించి నట్లు చెప్పే విష్ణు పుష్కరిణిలో స్నానమాడి స్వామిని సేవించడం ద్వారా స్వస్థత పొందుతారని చెబుతారు. శంకరభగవత్పా దులు రచించిన ‘లక్ష్మీనృసింహ కరావలంబ’ స్తోత్రం దీనినే స్ఫురింప చేస్తుంది. మానవాళిపై అపార సానుభూతితో వారిని ఆదుకోవాలని నృసింహుని వేడుకున్నారు. ‘ఈ సంసార సాగరంలో నౌక వంటి నీవు నాకు చేయూతనిచ్చి కాపాడు. భయంకరమైన దట్టమైన సంసారమనే అడవిలో కోరికలు అనే సింహాలు సంచరిస్తాయి. భయంకరమైన మొసళ్లు, తిమింగాలు గల ఈ సంసారమనే సాగరాన్ని ఈదలేకపోతున్నాను. ఈ సంసారం విషవృక్షం లాంటిది. ఎంతో ఎత్తుకు ఎగబాకిన చెట్టుపై నుంచి దిగలేకున్నాను. కోరల సాచిన ఆశలు క్రూర మృగాల మాదిరిగా వెంటాడ తాయి. అగాధమైన బావి అనే సంసారం లోతు ఎంతో తె•లియదు. అందులో దిగితే కష్టాలనే పాములు కాటేస్తాయి. సంసారమనే అడవిలో సమస్యలు కష్టాలు అనే దావాగ్ని (మంటలలో) చిక్కుకున్నాను. అజ్ఞానం అంధుడిని చేస్తోంది. ఇంద్రియాలు చోరుల్లా దోచుకుంటున్నాయి. మోహం అనే అగాధంలో పడిపోతున్న నన్ను రక్షించు’ అంటూ భక్తుల తరపున వేడుకున్నారు. ‘నిన్ను ఐశ్వర్యం కోసం అనుసరించడంలేదు. ధనకనకవస్తు వాహనాలను కోరడంలేదు. భూపశుసంపద, బలం కోసం పట్టుబట్టడం లేదు. సత్వరం మోక్షం ప్రసాదించు చాలు నీలవర్ణా!’ అని శేషప్ప తదితర కవులు చేసిన విన్నపాలను ఆలకించి అలంబనగా నిలుస్తాడని భక్తజన విశ్వాసం.

దానవ్రతాలకు, యజ్ఞయాగాదులకు, జపతపాదు లకు, నియమనిష్ఠలకు వశం కానీ శ్రీహరి భక్తికి బందీ అవుతాడని, ముఖ్యంగా ఆర్తులను ఆదు కోవడంలో ముందుంటాడని ఆధ్యాత్మిక•వాదులు చెబుతారు. ఆ కోవలోని ఇతర నృసింహ క్షేత్రాలతో పోలిస్తే, స్వస్థత పొందేందుకు వచ్చే అనారోగ్యం, గ్రహపీడితుల సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. యాదాద్రీశుని కరుణతో స్వస్థత పొందినవారిలో ‘యాదగిరి క్షేత్ర సంకీర్తన’ కవి ఈగ బుచ్చిదాసును ప్రముఖంగా చెబుతారు. ఓరుగల్లుకు చెందిన ఆయన తీవ్ర అనారోగ్యంతో ఎన్ని ఔషధాలు వాడినా గుణం కనిపించలేదట. దాంతో భగవంతుడిపై భారం వేసి కొండపై గల గుండం వద్ద గుడిసె వేసుకుని ఉంటూ, భాగవత ఘట్టాలను పారా••ణం చేస్తూ భక్తులకు వివరించి చెప్పేవారట. ఒకసారి స్వామి వారు ఆయనకు కలలో కనిపించి తనపై కీర్తనలు చెప్పాలని ఆదేశించారట. అప్పటి నుంచి సంకీర్తనలతో పాటు స్వామి వారిపై శతకం రాశారు.

 బ్రహ్మోత్సవ వైభవం

నృసింహుని బ్రహ్మోత్సవాలలో భాగంగా, మొదటిరోజు స్వస్తి వాచకసహిత శుద్ధి. మంత్ర జలంతో ఆలయ వీధులను శుద్ధి చేసి ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగేలా విష్వక్సేనుడికి బాధ్యతలు అప్పగిస్తారు. సాయంత్రం పుట్ట బంగారం (మట్టి)లో నవధాన్యాలు నాటి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. రెండవ నాడు ధ్వజారోహణ, ఆ రాత్రి భేరీపూజ చేపడతారు. మూడో రోజు వేద పారాయ ణంతో పాటు ఉదయం మత్స్యావతార అలంకారంలో సేవించి రాత్రికి శేష వాహనంపై ఊరేగిస్తారు. నాలుగవ రోజు ఉదయం శ్రీకృష్ణ అలంకారం, రాత్రి హంసవాహన సేవ, ఐదవ నాటి ఉదయం పటవత్ర సాయికి ‘జోల’, సాయంత్రం కల్పవృక్ష వాహనసేవ ఉంటుంది. ఆరవనాడు స్వామి వారు గోవర్ధన గిరిధారిగా దర్శనమిచ్చి రాత్రి సింహ వాహనంపై ఊరేగుతారు. ఏడవనాడు జగన్మోహినిగా సాక్షాత్క రించి, అశ్వవాహనరూఢుడై ఎదుర్కోలు సంబరానికి బయలుదేరతారు. ఎనిమిదవ నాటి ఉదయం హనుమద్వాహనంపై రామావతారంలో దర్శనమిచ్చి, గజేంద్రవాహనం అంబారిపై ఊరేగుతూ కల్యాణ మండపానికి చేరుకుంటాడు. అర్థరాత్రి లక్ష్మీ నరసింహుల తిరుకల్యాణం, తొమ్మిదవ రోజు ఉదయం గరుడవాహనసేవ, సాయంత్రం దివ్యవిమాన రథోత్సవం నిర్వహిస్తారు. నిరంతరం స్వామితో ఉంటూ ఆయనకుసేవలు అందించే శ్రీచక్ర ఆళ్వార్‌ ‌స్వామి వారికి తీర్థ స్నానం(చక్రస్నానం) పదవ రోజున ఉంటుంది. చక్రస్నానం, ఆ మరునాడు అష్టోత్తర శతాఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అవుతాయి.

 గుహాలయం నుంచి బాలాలయానికి మారి ఆరేళ్ల పాటు దర్శనమిచ్చిన యాదగిరీశుడు, దివ్యభవ్య మందిరం దర్శనం అందుబాటులోకి వచ్చిన తరువాత జరుగనున్న కల్యాణోత్సవాల కోసం భక్తికోటి నిరీక్షిస్తోంది.

మంగళం నారసింహాయ మంగళం గుణసింధవే

మంగళాం నివాసాయ యాదాద్రీశాయ మంగళమ్‌!!

‌వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram