శబరిమలలో హిందూ సమాజం మనోవేదనకు గురవుతోందని, అందుకు అక్కడి వామపక్ష ప్రభుత్వమే కారణం అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్సంఘచాలక్ డా.మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తపరిచారు. అక్కడి హిందువులు చేస్తున్న ఆందోళన మిగతా హిందూ సమాజం మొత్తానికి సంబంధించినది అని, వారికి మనందరం మద్ద తివ్వాలి అని ఆయన అన్నారు. ఫిబ్రవరి 1,2 తేదీ లలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో జరిగిన ధర్మసమ్మేళనం (ధర్మ సంసద్) లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ధర్మ సంసద్ జగద్గురు స్వామి వాసుదేవానంద సరస్వతీ మహారాజ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్ర మంలో దేశమంతటి నుండి పూజ్య స్వామీజీలు, సంత్లు పాల్గొన్నారు. వీరందరినీ ఉద్దేశించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, సర్సంఘ చాలక్ డా|| మోహన్ భాగవత్ ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ‘శబరిమల ఆందోళన సమాజం యొక్క సంఘర్షణ’ అని అన్నారు. కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును హద్దులు దాటి అమలు పరుస్తోంది. కమ్యూనిస్టు ప్రభుత్వం ‘అయ్యప్ప’ భక్తులు కాని వారిని భక్తులుగా చెపుతూ మోసపూరితంగా అయ్యప్ప ఆలయంలోకి తీసుకెళ్లారు. అంతేకాకుండా నిరసన తెలియజేస్తున్న అయ్యప్ప భక్తులపై అమానుషంగా దాడులు చేస్తున్నారు. కమ్యూనిస్టు ప్రభుత్వ పాలనలో హిందువులు మనోవేదనకు గురవుతున్నారు. కేరళలో హిందూ సమాజం ఈ విషయమై ఆందోళన చేస్తోంది. మనమందరం ఈ ఆందోళనకు మద్దతిస్తాం. ఇక్కడ గమనించవలసిన విషయమే మంటే శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం కోసం కోర్టుకు వెళ్లిన వారు అయ్యప్ప భక్తులు కారు. హిందూ సమాజంలో చిచ్చులు పెట్టడానికి, హిందూ సమాజాన్ని విడగొట్టడానికి పలు విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కులాల మధ్య విద్వేషాలు రెచ్చ గొడుతున్నారు. ఈ సమస్యలన్నింటిని అధిగమించా లంటే మనం సామాజిక సమరసతను పెంపొందిం చాలి, కుటుంబ సంస్కృతిని కాపాడుకోవాలి. సమాజంలో ధర్మజాగరణకై మనమందరం కృషి చేయాలి. హిందూ సమాజం నుండి వేరుపడ్డ వారిని ధర్మజాగరణ ద్వారా తిరిగి హిందూ సమాజంతో కలుపుకోవాలి. అంతేగాకుండా హిందూ సమాజం నుండి విడిపోవాలనుకునేవారిని విడిపోకుండా చూడాలి. ఇక ఈ విషయాలపై మనం శ్రద్ధ వహించాలి అన్నారు.
విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ మహామంత్రి మిలింద్ పరాండే ప్రసంగిస్తూ హిందూ సమాజం స్వయం జాగరూక సమాజమని, కాలానుగుణంగా అది తనలోని దోషాలను స్వయంగా నిర్మూలించు కుందని అన్నారు. కేరళలో కమ్యూనిజం బలపడా లంటే అయ్యప్ప దేవుడిపై హిందువులకున్న భక్తి శ్రద్ధలను రూపుమాపాలని కేరళ కమ్యూనిస్టు నాయకుడు నంబూద్రిపాద్ వారి కార్యకర్తలకు నూరిపోశారని అన్నారు. క్రీ.శ.1950 సంవత్సరంలో అయ్యప్ప మందిరంలోని విగ్రహం ధ్వంసం చేయబడింది. ఆలయానికి నిప్పంటించారు. అయ్యప్ప భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడానికి కమ్యూనిస్టులు ఈ చర్యకు ఒడిగట్టారు. సుప్రీంకోర్టు అయ్యప్ప ఆలయ ప్రవేశ విషయంలో ఇచ్చిన తీర్పు తర్వాత అయ్యప్ప భక్తులు, మాతృమూర్తులు, సోదరీమణులు నేటికీ సంఘర్షణ చేస్తూనే ఉన్నారు. కాని కమ్యూనిస్టు ప్రభుత్వం అయ్యప్ప భక్తులపై దమన నీతిని అమలు చేస్తోంది. ఇప్పటికే ఈ సంఘర్షణలో 5 గురు అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో పరిస్థితి ఈ విధంగా ఉంటే దేశంలోని మిగతా రాష్ట్రాలలో కూడా హిందువుల మధ్య విబేధాలు సృషిస్తున్నారు. జాతి, భాషల ఆధారంగా వేరు చేయాలని చూస్తున్నారు. ఈ మధ్య మహారాష్ట్ర, అస్సాం, గుజరాత్లో జరిగిన సంఘట నలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి’ అని మిలింద్ పరాండే అన్నారు.
స్వామి రాందేవ్ మాట్లాడుతూ దేశంలో సమాన పౌర చట్టం ఉండాలని అన్నారు. మైనారిటీలకు ప్రత్యేక చట్టాలు అవసరం లేదన్నారు.
ఇదే వేదికపై జగద్గురు రామానందాచార్య నరేంద్రాచార్య మహరాజ్, జగద్గురు రామానుజా చార్య హంసదేవీచార్య మహరాజ్, నిర్మల్ పీఠాధీశ్వర్ మహంత్ జ్ఞానదేవ్ మహరాజ్, స్వామి జితేంద్రనాథ్ సత్పాల్ మహరాజ్, వియోగానంద్ మహరాజ్, స్వామి వివేకానంద సరస్వతీ మహరాజ్, ఆనంద అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ బాలాకానంద్ మహరాజ్, నిరంజనీ అఖోడాకు చెందిన స్వామీ పుణ్యానంద్గిరి మహరాజ్, స్వామి చిదానంద్ సరస్వతీ మహరాజ్, స్వామీ పరమానంద్ మహరాజ్, అయ్యపాదాస్ మహరాజ్, స్వామీ జితేంద్రానంద్ సరస్వతీ మహరాజ్, డా||రామేశ్వర దాస్ వైష్ణవ్, మహంత్ నృత్య గోపాల్ దాస్ మహరాజ్, మహామండలేశ్వర్ జయరామదాస్ మహరాజ్లతో పాటు 200 మంది ఇతర సాధువులు వేదికపై ఆసీనులయ్యారు. మరో 3000 మంది సాధు సంతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కేంద్రీయ మార్గదర్శక మండలి ప్రముఖ సభ్యుడు, సభ మహామంత్రి స్వామీ పరమాత్మానంద మహారాజ్, శబరిమల సంఘర్షణ, అయోధ్య ఆందోళన విషయాలను ప్రస్తావించారు. దీనికి స్వామి అయ్యప్పాదాస్ మహారాజ్ మద్దతు తెలిపారు. స్వామీ గోవింద దేవ్ మహారాజ్ హిందూ సమాజాన్ని విడగొట్టేందుకు జరుగుతున్న విషప్రచారం గురించి ప్రస్తావించగా సంత్ సమితి మహామంత్రి స్వామీ జితేంద్రనాథ్ మహారాజ్ మద్దతు తెలిపారు.