ప్రభుత్వాలు అంటే ప్రజాసంక్షేమానికి వారధులు. పాలకులు వాటికి ప్రతినిధులు. అయితే, తెలంగాణలో మాత్రం ఈ నిర్వచనం మారిపోయింది. సంక్షేమం, పథకాలు, పాలనతో పాటు మరో అంశం కూడా వచ్చి చేరింది. అదే రియల్‌ ఎస్టేట్‌. ‌సర్కారు భూములు ఎక్కడున్నా ప్రభుత్వం యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తోంది. వేలం వేసి మరీ ప్రభుత్వ ఖజానాను నింపేస్తోంది. దీంతో భవిష్యత్తు అవసరాలు అనే అంశం వచ్చేసరికి అంతా శూన్యంగా మారిపోయే ప్రమాదం దాపురించింది. ప్రభుత్వం విలువైన భూములను వేలం వేసే పక్రియ మొదలు పెట్టాక రాజధాని ప్రాంతంలో సర్కారు భూమి కావాలంటే భూతద్దం వేసి వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక, ఇప్పుడు రాజధాని ప్రాంతం పరిధి దాటి హైదరాబాద్‌ ‌నీటి అవసరాల కోసం రూపొందించిన 111 జీవో పరిధిలోని భూములకు రెక్కలొస్తున్నాయి. అందనంత దూరం ఎగిరిపోతున్నాయి.

రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం ప్రభుత్వ ప్రాజెక్టులతో పరోక్షంగా అనుసంధానమైపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా సరే అంగుళం భూమి ధర పెరగాలన్నా, తగ్గాలన్నా అంతా సర్కారీ పెద్దల, అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే సాగుతోందంటు న్నారు. వారి నియంత్రణలోనే అంతా జరుగు తోందంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని భూములను తమ అధీనంలోకి తీసుకోవడం, తర్వాత వాటి విలువ పెరిగే విధంగా నిర్ణయాలను తీసుకోవడం, ఆ భూములకు సంబంధించిన వివాదాలేవైనా ఉంటే వాటిని సాకుగా చూపి కొంతమేర స్వాధీనం చేసుకోవడం సర్వసాధారణంగా మారిందన్న విమర్శలున్నాయి.

ఈ తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ ‌పాలనలో రాష్ట్రంలోని విలువైన భూములన్నీ ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లాయి. అప్పటివరకు సాధారణ స్థాయిలోనే ఉన్న భూముల ధరలు ఆ తర్వాత అమాంతం పెరిగిపోయాయి. భూముల ధరలు పెరిగే చోట బినామీలతో, కుదరకపోతే తమ వారితో కొనిపించడం లేదా ముందే భూములు కొనిపించి, ఆపై వాటి ధరలు పెరిగేలా నిర్ణయాలు తీసుకోవడం, లేదా రియల్‌ ‌వ్యాపారులకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు తీసుకుని, అందుకు బదులుగా కొంత భూమిని వారి నుంచి తీసుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఉదాహరణకు, హైదరాబాద్‌ ‌నగరంతో పాటు, ఐటీ కంపెనీల కారణంగా అభివృద్ధి చెందిన చుట్టుపక్కల ప్రాంతాలు నానక్‌రాం గూడ, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగ్‌, ‌కోకాపేట వంటిచోట్ల 100 అడుగుల రోడ్డు ఉంటేనే భారీ భవంతులు, ఆకాశహర్మ్యాలు కట్టేందుకు అనుమతి స్తారు. అక్కడ 100 అడుగుల రోడ్డుకు అనుమతి రావడం అంత కష్టమేమీ కాదు. ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు ఆ భూమిలో అర ఎకరం నుంచి ఎకరం మేర జాగా ఇస్తే చాలు. రోడ్డు మంజూరైపోతుంది. ఆపై ఆకాశహర్మ్యాలు కట్టుకుని సామాన్యులకు భారీ ధరలకు ఆయా ఫ్లాట్లను అంటగట్టొచ్చు. కొంతమంది పెద్దలైతే.. భూములు కాకుండా, సదరు ఆకాశహర్మ్యాల్లోని కొన్ని ఫ్లాట్లు డిమాండ్‌ ‌చేసి మరీ తీసుకుంటున్నారన్న ఆరోపణ లున్నాయి. ఐటీ కారిడార్‌ ‌ప్రాంతంగా పేరొందిన హైదరాబాద్‌కు పశ్చిమ ప్రాంతంలో ప్రభుత్వం ఇటీవలే కొంత మంది బడా రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రజాప్రయోజనాల పేరుతో ఇలా వంద అడుగుల రోడ్డు నిర్మాణానికి అనుమతు లిచ్చింది. ఈ రోడ్డు నిర్మాణంతో ఆ ప్రాంతంలోని రియల్టర్లకు భారీ ఎత్తున ప్రయోజనం కలుగుతోంది. నిజానికి అక్కడ 100 అడుగుల రోడ్డు వేయాలన్న ప్రతిపాదనలు గతంలో లేవు. కానీ రియల్‌ ఎస్టేట్‌ ‌బూమ్‌ ‌కోసమే ఆ రోడ్డును నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక, భూముల ధరలు అసహజంగా పెరిగిపోయే ఈ దందాలో ప్రధానంగా రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారులు, రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్ధలు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీరంగ ప్రముఖులదే కీలకపాత్రగా చెప్పుకుంటున్నారు. వీరు ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారిస్తారు. ఆ భూములకు చుట్టూ ఉండే భూములను రైతుల నుంచి చాలా తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు. భూములన్నీ వారి చేతుల్లోకి మారాక ఆ భూముల ధరలు అమాంతంగా పెంచేస్తారు. అప్పటికీ పరిస్థితులు వారికి అనుకూలంగా లేకపోతే, అక్కడ భారీగా పరిశ్రమలు, కార్పోరేట్‌ ‌సంస్థలు, ఫార్మా కంపెనీలు, రింగురోడ్డు వంటివి వస్తాయని ప్రభుత్వ పెద్దల ద్వారా ప్రకటనలు చేయిస్తారు. ఉదా హరణకు.. హైదరాబాద్‌ ‌శేరిలింగంపల్లి సమీపంలోని వట్టినాగులపల్లి పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రాష్ట్రంలోనే పేరొందిన కొన్ని నిర్మాణ సంస్థలు కొంతకాలం కిందట అక్కడ తక్కువ ధరకే వందల ఎకరాలు భూములు కొనుగోలు చేశాయి. ఆ తర్వాత.. శేరిలింగంపల్లి, శంకర్‌పల్లి, పటాన్‌చెరు మండలాల పరిధిలో డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం వేల సంఖ్యలో నిర్మించింది. వాటి నిర్మాణం పూర్తయి దాదాపు మూడేళ్లవుతున్నా, లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. అది వేరే విషయం. కానీ.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు కొనేసిన ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థలు ఈ ప్రభుత్వ నిర్మాణాలను చూపి ఆకాశహర్మ్యాలు, అపార్ట్‌మెంట్లు భారీ సంఖ్యలో నిర్మిస్తున్నాయి.

శివారు ప్రాంతాలనూ వదలని వైనం

హైదరాబాద్‌ ‌నగరంలో రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం మూడు అపార్ట్‌మెంట్లు.. ఆరు ఫ్లాట్లు మాదిరిగా డెవలప్‌ ‌కావడంతో రాజధాని శివారు ప్రాంతాలపై సర్కారు దృష్టి సారించిందన్న ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మొయినాబాద్‌, ‌శంకర్‌పల్లి, చేవెళ్ల, గండిపేట, శంషాబాద్‌, ‌షాద్‌నగర్‌, ‌షాబాద్‌ ‌మండలాల్లోని 84 గ్రామాలు 111 జీవో పరిధిలో ఉండడంతో ఇటీవలి దాకా అక్కడి భూములకు పెద్దగా ధరలు పలకలేదు. అక్కడ భూముల తక్కువ ధరకే వస్తుండడంతో సాధారణ రేట్లకే రాజకీయ నేతలతో పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణలు చేపట్టే సంస్థలు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టు నుంచి కమెడియన్‌ ‌వరకూ, విలన్‌ ‌పాత్రధారుల నుంచి హీరోల దాకా అక్కడ భూములు కొనుగోలు చేసిన వారి జాబితాలో ఉన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ ‌తదితర ఉన్నతాధికారులకూ అక్కడ భూములున్నాయి. 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాల్లో దాదాపు 1.32 లక్షల ఎకరాల భూమి ఉండగా.. అందులో గ్రామకంఠం, ప్రభుత్వ భూములు, చిన్న, సన్న కారు రైతుల భూములు పోను, దాదాపు 70 వేల ఎకరాలు ఇలా పెద్దోళ్ల చేతుల్లోనే ఉన్నాయని అంచనా. 111 జీవో ఎత్తివేతపై ముందస్తు సమాచారం ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అక్కడ వందల ఎకరాల భూములు కొనుగోలు చేశారు. అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీకి ఆ ప్రాంతంలో పెద్దఎత్తున భూములున్నాయి. గత ఏడాది ఒక ఎంపీ అక్కడ వందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ ఏడాదిలోను అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు పదుల ఎకరాల నుంచి వందల ఎకరాలు కొన్నారు. 111 జీవో ఎత్తివేతపై దాదాపు రెండేళ్ల క్రితమే వీరికి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.

ట్రిపుల్‌ ఆర్‌ ‌చుట్టూ రియల్‌ ఎస్టేట్‌ ఉచ్చు

మరోవైపు అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాల పరిసరాలను కూడా రాజకీయ నాయకులు వదిలిపెట్టడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ ‌బూమ్‌ ‌రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు చుట్టూ తిరుగుతోంది. త్వరలోనే ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు రెండు సంవత్సరాల కిందటే ప్రకటించాయి. ట్రిపుల్‌ ఆర్‌ (‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్‌)‌ను మంజూరు చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 ఆగస్టు 29న కేంద్ర మంత్రికి లేఖ రాశారు. అప్పటి నుంచి ఈ రోడ్డుకు ఇరువైపులా సంగారెడ్డి, మెదక్‌, ‌తూప్రాన్‌, ‌గజ్వేల్‌, ‌జగదేవ్‌పూర్‌, ‌భువనగిరి, చౌటుప్పల్‌, ‌కంది, శంకర్‌పల్లి, చేవెళ్ల, నవాబుపేట, షాబాద్‌, ‌షాద్‌నగర్‌, అమన్‌గల్‌, ‌కందుకూరు తదితర మండలాల పరిధిలోని వేల ఎకరాల భూములను బహుళ జాతి నిర్మాణ సంస్థలు కొనుగోలు చేశాయి. వీటితో పాటు రాజకీయ నేతలు కూడా సాధారణ రేట్లకు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ భూములు కోట్లలో ధర పలుకుతున్నాయి. వీరి దందాలతో భూముల ధరలు చుక్కలనంటు తుండడంతో సామాన్యుడు జానెడు జాగా కూడా కొనలేక సతమతమవుతున్నాడు.

ఫార్మాసిటీ ప్రకటనకు

ముందే పోటెత్తిన కొనుగోళ్లు

ఇటువైపు చూస్తే, రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే కందుకూరు, యాచారం, కడ్తాల్‌ ‌మండలాల్లో 2016-17 ప్రాంతంలో దాదాపు 19 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మాణానికి భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 14 వేల ఎకరాల వరకు భూమిని సేకరించింది. అయితే.. అంతకు ముందే ఓ మాజీ ఎమ్మెల్యే మరో ఇద్దరు కలిసి అక్కడ ఎకరా రూ.1.5 లక్షల చొప్పున 250 ఎకరాలు కొనుగోలు చేశారు. ఫార్మా సిటీ నిర్మాణం కోసం భూ సేకరణ సమయంలో వారు ఆ 250 ఎకరాలనూ ప్రభుత్వానికి అప్పగించారు. ఎకరాకు దాదాపు రూ.9 లక్షల వరకూ పరిహారం కింద తీసుకున్నారు. అలాగే.. ఈ ఫార్మా సిటీ నిర్మాణం చేపట్టక ముందే కొన్ని నిర్మాణ సంస్థలు కడ్తాల్‌, ‌మక్తమాదారం, తాక్రాజ్‌గూడ గ్రామాల పరిధిలో వేల ఎకరాలు కొనుగోలు చేశాయి. వాటిలో విల్లాలు నిర్మించి విక్రయిస్తూ కోట్లాది రూపాయలు గడించాయి.

యాదాద్రిలో పడిపోయిన డిమాండ్‌

‌తెలంగాణ ఆధ్యాత్మిక భాండాగారం యాదాద్రి చుట్టూ కూడా రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం జోరుగా సాగుతోంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం నిర్మాణం పేరుతో గత మూడేళ్లుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ ‌బాగా పుంజుకుంది. ఆలయ నిర్మాణం పనులు మొదలు పెట్టక ముందే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఒక ఎమ్మెల్సీ కొంత మంది నాయకులతో కలిసి అక్కడ 1000 ఎకరాలకు పైగా భూములు కొన్నారు.

ఆలయ నిర్మాణం పూర్తయితే పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు వస్తారని, ఆ ప్రాంతం అంతా మరో తిరుపతిగా మారుతుందని ఊదరగొట్టారు. దీంతో అక్కడ రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం కొంతకాలం పాటు ఆకాశానికి నిచ్చెనలు వేసేలా సాగింది. అదే అదనుగా రియల్టర్లు అవసరాలకు మించి లే అవుట్లు వేశారు. దీంతో, కొనేవాళ్లు తక్కువై వ్యాపారం ఢమాల్‌ అం‌ది. దాదాపు ఏడాదిన్నర కిందట అక్కడ గజం విలువ రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పలికితే ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు తల్చుకుంటే… ఆ భూములు నగరానికి దూరంగా ఉన్నా, సాధారణ ప్రజలకు ప్రయోజనం లేకపోయినా, సాగుకు ఆమోదయోగ్యం కాకపోయినా ఆయా ప్రాంతాల్లో రియల్‌ ‌బూమ్‌ ‌సృష్టించి, సొమ్ములు దండుకుని మాయమైపోతా రనడానికి నిదర్శనం ఈ ఉదాహరణ. అక్కడ ఏడాదిన్నర క్రితం భూములు కొన్న వాళ్లు, కొన్న ధరకన్నా తక్కువకు అమ్ము దామన్నా కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ ‌దందా సాగిస్తున్న వాళ్లేమో మరింతగా సంపాదిస్తున్నారు. సామాన్యులు మాత్రం ఎప్పటిలాగే బిత్తరపోతున్నారు.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram